కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్టా కుస్తీ 2’ (తెలుగులో మట్టి కుస్తీ 2) థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 2022లో విడుదలైన సూపర్హిట్ గట్టా కుస్తీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా తమిళనాడులో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. పాజిటివ్ టాక్తో బ్రేక్ఈవెన్ దాటి నిర్మాతగా విష్ణు విశాల్కు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విజయంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ విష్ణు విశాల్కు వీడియో కాల్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. “కంగ్రాచ్యులేషన్స్ విష్ణు.. ఇది గొప్ప విజయం. చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో కాల్కు సంబంధించిన స్క్రీన్షాట్ను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న ఆమిర్ ఖాన్కు కృతజ్ఞతలు తెలిపారు.
విష్ణు విశాల్, ఆమిర్ ఖాన్ల స్నేహం చాలా కాలంగా కొనసాగుతోంది. విష్ణు భార్య, మాజీ భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ద్వారా ప్రారంభమైన పరిచయం తర్వాత ఇద్దరూ కుటుంబ స్నేహితులుగా మారారు. 2023 చెన్నై వరదల సమయంలో ఆమిర్ ఖాన్కు విష్ణు విశాల్ అందించిన సహకారం వారి బంధాన్ని మరింత బలపరిచింది.
చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించగా, రమ్యకృష్ణ, యోగి బాబు, కాళీ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. కుటుంబ బాధ్యతలు, దాంపత్య బంధం, వ్యక్తిగత ఆశయాల మధ్య జరిగే సంఘర్షణలను హాస్యం, భావోద్వేగాలతో దర్శకుడు ఆకట్టుకునేలా చూపించారు.

