సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘గోదారి గట్టు..’ అనే గీతాన్ని ఆలపించారు. ఈ పాట మ్యూజిక్ చార్ట్స్లో అగ్రభాగాన కొనసాగుతోంది. ఇప్పటికే 27 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. స్వరకర్తగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు రమణ గోగుల. కెరీర్లో ఎన్నో సూపర్హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రమణ గోగుల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నేను యూఎస్లో ఉంటున్నా. వ్యక్తిగత జీవితంలో బిజీ కావడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. నేను యూఎస్లో ఉన్నప్పుడు చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ కాల్ చేసి తప్పకుండా పాట పాడాలని కోరాడు.
సాంగ్ పంపిస్తే రెండుసార్లు విన్నా. చాలా బాగా నచ్చింది. అందులో కొత్తదనంతో పాటు మంచి ఫీల్ ఉందనిపించింది. దాంతో తప్పకుండా పాడాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. చాలామంది ఫోన్ చేసి పాట బాగుందని, వాయిస్లో అదే మ్యాజిక్ ఉందని పొగడటం ఆనందంగా ఉందని, వెంకటేష్ కూడా ఫోన్ చేసి పాట గురించి మెచ్చుకున్నారని రమణ గోగుల తెలిపారు.