బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ అమెరికాలో అరెస్టయ్యారు. జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో న్యూయార్క్లోని క్వీన్స్లో మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నవంబర్ 2న రెండంతస్తుల గ్యారేజీలో మంటలు అంటుకుని అలియా (43) మాజీ స్నేహితుడు ఎడ్వర్డ్స్ జాకబ్స్, అతని స్నేహితురాలు ఎటీన (33) సజీవదహనం అయ్యారు. అయితే ఆ రోజు ఉదయం జమైకాలోని గ్యారేజీ వద్దకు వచ్చిన అలీనా.. ఈరోజు మీరంతా చనిపోబోతున్నారంటూ అరుస్తూ నిప్పంటించారని డిస్ట్రిక్ట్ అటార్నీ మెలిండా కెట్జ్ కార్యాలయం వెల్లడించింది. ఆ సమయంలో జాకబ్స్, తన స్నేహితురాలు గ్యారేజీ పై అంతస్తులో నిద్రపోతున్నారని వెల్లడించారు. అలీనా అక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్ష సాక్షి చూశారని వెల్లడించారు.
ఏడాది క్రితం అలీనాతో రిలేషన్షిప్కు జాకబ్స్ ఫుల్స్టాప్ పెట్టారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదని జాకబ్ తల్లి జెన్నెట్ వెల్లడించారు. తన కుమారుడు వడ్రంగిగా పనిచేస్తున్నాడని, గ్యారేజీగా ఉన్న రెండంతస్తుల భవనాన్ని అపార్ట్మెంట్గా మార్చే పనిలో నిమగ్నమై ఉన్నాడని తెలిపారు. కాగా, రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన రాక్స్టార్ సినిమాలో నర్గీస్ ఫక్రీ నటించారు. అయితే ఆమె ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు. అలియా తల్లి మాత్రం ఒకరిని చంపిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటోంది.