త‌మిళ న‌టుడు రూ.5 కోట్ల మోసం కేసులో అరెస్ట్..

త‌మిళ న‌టుడు రూ.5 కోట్ల మోసం కేసులో అరెస్ట్..

“పవర్‌స్టార్”గా సుపరిచితుడైన త‌మిళ న‌టుడు ఎస్. శ్రీనివాసన్‌ని ఒక భారీ మోసం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1,000 కోట్ల లోన్ ఇప్పిస్తాన‌ని చెప్పి ఒక సంస్థ నుండి రూ.5 కోట్లు కమిషన్‌గా తీసుకుని మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌డిని బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2010లో ‘బ్లూ కోస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్’ అనే సంస్థకు రూ.1,000 కోట్లు లోన్ ఇప్పిస్తాన‌ని శ్రీనివాస‌న్ హామీ ఇచ్చాడు. దీనికి బ‌దులుగా.. వారి వ‌ద్ద నుండి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. నెల రోజుల్లో లోన్ వ‌స్తుంద‌ని రాక‌పోతే డ‌బ్బులు తిరిగి చెల్లిస్తాన‌ని హామీ ఇచ్చాడు. అయితే నెల కంటే ఎక్కువ‌ రోజులు గ‌డుస్తున్నా లోన్ మంజూరు కాక‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించిన‌ సంస్థ యాజ‌మాన్యం పోలీసుల‌ను ఆశ్రయించింది. అయితే ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రూ.5 కోట్లు నేరుగా శ్రీనివాసన్, అతని భార్య బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. అలాగే ఈ డ‌బ్బుని అత‌డి వ్య‌క్తిగ‌త అవసరాల కోసం, సినిమాల నిర్మాణానికి ఖర్చు చేసినట్లు స‌మాచారం. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించకుండా, విచారణకు హాజరుకాకుండా 2018 నుండి  శ్రీనివాస‌న్ త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. దీంతో కోర్టు అత‌డిని నేర‌స్థుడిగా ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం అతడు చెన్నైలో ఉన్న‌ట్లు తెల‌వ‌డంతో అత‌డిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.

editor

Related Articles