మునుముందు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సినిమా వీక్షణ ఉండేలా, సౌకర్యాన్ని బట్టి సినిమా చూసే విధానాన్ని తీసుకొస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. డిజిటల్ యుగంలో సినిమా వీక్షణ విధానం పూర్తిగా మారిపోయింది. ప్రజలు మొబైల్ ఫోన్లోనే సినిమాలు, వెబ్ షోలు చూస్తున్నారు. ఓటీటీ వీక్షణ స్మార్ట్ ఫోన్తో చాలా సులువైపోయింది. ఈ పరిస్థితుల్లో సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా తరహాలో `సినిమా పాస్` విధానాన్ని ఇప్పటికే మల్టీప్లెక్సులు అమలు చేస్తున్నాయి. నెలలో సినిమాల వీక్షణను పెంచేందుకు, జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు బల్క్ బుకింగ్లతో ఉచిత టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రముఖ మల్టీప్లెక్సులు ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ విధానాల కోసం ప్రయత్నిస్తున్నాయి.
`FLEXI షో` అనే కొత్త విధానాన్ని పీవీఆర్ పరిచయం చేస్తోంది. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు షో నుండి మధ్యలోనే వెళ్లిపోవాలనుకుంటే, వీక్షణ శాతాన్ని బట్టి తిరిగి టికెట్ డబ్బులు వెనక్కి చెల్లించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పీవీఆర్ అమలు చేస్తోంది. FLEXI షో టికెటింగ్ మోడల్ టైమ్ బేస్డ్ రిఫండ్ సిస్టమ్ను పరిచయం చేస్తుంది. ప్రేక్షకులు తమకు సినిమా నచ్చకపోయినా లేదా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాల్సి ఉన్నా షో మధ్యలో వదిలి వెళ్లిపోవచ్చు.
థియేటర్ వదిలి వెళ్లేటప్పటికి సినిమాలో 75 శాతం కంటే ఎక్కువ మిగిలి ఉంటే, ఆడియెన్ వారి టిక్కెట్ ధరలో 60 శాతం తిరిగి పొందుతారు. మిగిలిన 50-75 శాతం కోసం 50 శాతం వాపసు ఇస్తారు. 25-50 శాతం సినిమా మిగిలి ఉంటే 30 శాతం వాపసు చెల్లిస్తారు. ఇది ఫ్యామిలీ అవసరం రీత్యా వెళ్లిపోతున్నా, లేదా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్లిపోవాలనుకున్నా.. వీక్షకులు తమ టిక్కెట్ ఖర్చు పరంగా ఎప్పుడూ లాక్ అయిపోవాల్సిన పనిలేదు. న్యూఢిల్లీ , గుర్గావ్లోని 40 సినిమా థియేటర్లలో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. మునుముందు దేశవ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు పీవీఆర్ ప్రయత్నిస్తోంది. ప్రేక్షకుడు సీటులోంచి వెళ్లేటప్పటికి గంట షో చూశారా? అరగంట షో చూశారా? సగం కంటే ఎక్కువ సినిమా చూశారా? అనేది నిర్ణయించేందుకు శక్తివంతమైన కెమెరాలు, ఏఐ వ్యవస్థ పనిచేస్తుందని సమాచారం. ప్రజల మారుతున్న జీవన శైలికి తగ్గట్టు పీవీఆర్ ఈ ఫ్లెక్సీ వీక్షణ విధానాన్ని అమలుచేస్తోంది. ప్రజల టైమ్ చాలా విలువైంది.