సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) డైరెక్టర్గా నియమితులైన నేపథ్యంలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిఫార్సు చేశారని వెల్లడించారు. ఏపీఎఫ్డీసీ డైరెక్టర్ పదవిని ఎంతో బాధ్యతగా భావిస్తున్నానని సుమన్ అన్నారు. దాదాపు 48 ఏళ్ల సినీ ప్రయాణంలో 11 భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించానని, తెలుగులోనే వంద సినిమాల్లో హీరోగా కనిపించానని చెప్పారు. అనేక చిత్రాల్లో దేవుడి పాత్రలు పోషించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.
‘అన్నమయ్య’ సినిమా విడుదలైన సమయంలో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి ఆ సినిమాని వీక్షించే అవకాశం లభించిందని సుమన్ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి భోజనం చేయడం తన జీవితంలో మరచిపోలేని అనుభవమని, అదే తనకు ‘భారతరత్న’ అందుకున్నంత ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ‘అన్నమయ్య’ విడుదలై 29 సంవత్సరాలు పూర్తయినా, ఇప్పటికీ ప్రేక్షకులు తనను వెంకటేశ్వరస్వామి పాత్రతోనే గుర్తుంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుమన్ తెలిపారు.

