స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలై పది రోజులు పూర్తయినా సినిమా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. ముఖ్యంగా రెండో వారాంతంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించడంతో ఆదివారం కూడా చిత్రం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే అనుష్క నటించిన ‘అరుంధతి’ లైఫ్టైమ్ కలెక్షన్లను అధిగమించినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి పది రోజుల్లో రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారతదేశంలో రూ.48.25 కోట్ల నెట్, రూ.55.86 కోట్ల గ్రాస్ రాబట్టగా, విదేశాల్లో రూ.22.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ.5.30 కోట్ల నెట్, రూ.6.14 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.
తెలుగు వెర్షన్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు వెర్షన్లో 46.94 శాతం, తమిళ వెర్షన్లో 40.21 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. రాష్ట్రాల వారీగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.4.50 కోట్లు, కర్ణాటకలో రూ.1.10 కోట్లు, తమిళనాడులో రూ.41 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.12 లక్షల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సుమారు రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే నాలుగు రెట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు మూడేళ్ల తర్వాత సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్లో మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా యాక్షన్, భావోద్వేగ సన్నివేశాల్లో సమంత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల జోరు చూస్తుంటే, త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

