బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు నిరసనల సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించారని కంగనా చేసిన వ్యాఖ్యలను విశాల్ తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడులు చేయడం, అనంతరం వారిపైనే నిందలు మోపడం సరైన విధానం కాదని ప్రశ్నించారు.
విద్యార్థులపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రస్తావించిన ఆయన.. కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, పెల్లెట్ గన్లతో గాయపరచడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమేనని పేర్కొన్నారు.
అంతేకాకుండా, విద్యార్థులను భయపెట్టేందుకు అధికార పక్షానికి చెందిన వ్యక్తులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం కంగనా ఎదుర్కొంటున్న విమర్శలు ఆమె చేసిన వ్యాఖ్యల ఫలితమేనని, అందుకే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని విశాల్ దద్లానీ తన పోస్టులో పేర్కొన్నారు.

