గత కొంతకాలంగా పూజా హెగ్డేకి టైమ్ కలిసి రావడం లేదు. హిందీతో పాటు దక్షిణాదిలో కూడా విజయాలకు దూరమైంది. కథాంశాల ఎంపికలో గతంలో మాదిరిగా కాకుండా తప్పులు జరగకుండా చూసుకుంటానని, రాబోయే సంవత్సరంలో వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పింది అగ్ర హీరోయిన్ పూజాహెగ్డే. తమిళ, తెలుగు భాషల్లో ఈ భామకు మంచి ఆఫర్లొస్తున్నట్లుగా తెలుస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న 69వ చిత్రంలో నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది. సూర్య 44వ సినిమాలో కూడా పూజాహేగ్డే కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కూడా ఈ సొగసరి భారీ ఆఫర్ను సొంతం చేసుకుంది. వరుణ్ధావన్ సరసన ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నట్లు తెలిసింది. ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ డైరెక్టర్. కాస్త విరామం తీసుకున్న తర్వాత బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్ను సొంతం చేసుకోవడం పట్ల పూజాహెగ్డే హ్యాపీగా ఫీల్ అవుతోంది. సినిమాల ఎంపికలో నా మైండ్సెట్ను మార్చుకున్నా. కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తా. వచ్చే ఏడాది నాకు కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నా అని పూజాహెగ్డే చెప్పింది.