ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, రచయిత రోహన్ థక్కర్ను ఆమె హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో జులై 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.
పెళ్లి అనంతరం అన్షులా సోషల్ మీడియాలో పలు ఫొటోలను పంచుకోగా, వాటిలోని ఓ ప్రత్యేకమైన క్షణం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సిందూర ధారణ సమయంలో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరూ వధువు ఇరువైపులా నిలబడి ఆచారం సక్రమంగా జరిగేలా సహాయం చేశారు. బ్రైడ్స్మెయిడ్స్గా వ్యవహరించిన వారి ఆప్యాయత, సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించడంతో అభిమానులు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. కపూర్ కుటుంబ బంధానికి ఇవి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక తన భర్త రోహన్ థక్కర్కు అన్షులా భావోద్వేగ సందేశాన్ని కూడా అంకితం చేశారు. “ఎన్నో పరిచయాలు, ఎన్నో ప్రయాణాల తర్వాత చివరకు నువ్వే నా జీవిత భాగస్వామివయ్యావు. నా జీవితంలో ప్రతి క్షణంలో నాకు అండగా నిలిచిన వ్యక్తి నువ్వే. నాతో మాట్లాడేందుకు నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు అత్యంత సురక్షితమైన స్థలం, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం నువ్వే” అంటూ ప్రేమను వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్కు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివాహానికి ముందు జరిగిన మెహందీ, చూడా వేడుకల్లోనూ జాన్వీ, ఖుషీ చురుగ్గా పాల్గొని సోదరి పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చడం విశేషంగా నిలిచింది.

