ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి.టి.డి.సి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ) ఛైర్మన్ పి. భరత్భూషణ్ తెలిపారు. ఇటీవల ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను వినోద పరిశ్రమకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఆ దిశగా సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కార్పొరేషన్ తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే నటసింహం బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి సినీ కార్యక్రమాలు రాష్ట్రంలో మరింతగా నిర్వహించబడేలా ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.
సినీ రంగానికి అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను చిత్ర పరిశ్రమకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని భరత్భూషణ్ తెలిపారు.

