టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి నుండి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే వేగంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బుక్ మై షోలో పలు థియేటర్లు హౌస్ ఫుల్ కావడం విశేషం. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి అనుష్క గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తోంది. ఆమె పాత్ర పేరు శీలావతి.
ఓ సాధారణ బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ఆమె, పరిస్థితుల ఒత్తిడిలో అక్రమ మార్గంలోకి వెళ్లి, స్మగ్లింగ్ ప్రపంచంలో ఎలా ఎదిగిందనేదే కథాంశం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, సినిమాపై అంచనాలను పెంచింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా, గ్రామీణ శైలిలో బలమైన ఎమోషన్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రానుందని చిత్రబృందం చెబుతోంది. క్రిష్ మార్క్ సినిమాటోగ్రఫీ, బలమైన కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.
