బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 సినిమా వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ కవి, యూట్యూబర్ యాహ్యా బూట్వాలా ఈ సినిమాలోని ఒక డైలాగును తన కవిత నుండి కాపీ చేశారని ఆరోపించారు. ‘జలియన్వాలా బాగ్’ అనే తన కవితలోని కొన్ని లైన్లను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని ఆయన ఆరోపిస్తూ సాక్ష్యాలతో సహా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బూట్వాలా తన కవితను చదువుతున్న వీడియో క్లిప్ను, అలాగే ‘కేసరి 2’లోని అనన్యాపాండే ఆ డైలాగును చెబుతున్న క్లిప్ను జతచేసి పోల్చి చూపించారు. రెండు క్లిప్లలోని లైన్లు చాలాదగ్గరగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన కేసరి 2 సినిమా డైలాగ్ రచయిత సుమిత్ సక్సేనాపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక రచయితగా, మరొకరి రచనకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ చేయడం దారుణమని ఆయన అన్నారు. తన కవితలోని పదాలను కూడా కాపీ చేశారని, ఇది యాదృచ్చికంగా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ కరణ్ జోహార్, దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి, హీరో అక్షయ్ కుమార్, అనన్యా పాండేలను ట్యాగ్ చేయాలని తన అభిమానులను కోరారు. తన రచనలతో ఎవరికైనా అనుబంధం ఉంటే, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంలో సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై చిత్ర నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, బూట్వాలా షేర్ చేసిన వీడియో, పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు బూట్వాలాకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఇది కేవలం స్ఫూర్తి పొందిన సందర్భం కావచ్చునని అభిప్రాయపడుతున్నారు.
- April 26, 2025
0
114
Less than a minute
Tags:
You can share this post!
administrator


