కోలీవుడ్ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిష పేర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. అయితే ఈసారి కారణం వారి వ్యక్తిగత జీవితం కాదు.. తమిళనాడులోని ఓ ఆలయ ఉత్సవంలో ఏర్పాటు చేసిన వివాదాస్పద బ్యానర్. సేలం జిల్లా ఆత్తూర్లో జరుగుతున్న మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా కొందరు యువకులు విజయ్, త్రిష చిత్రాలతో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో విజయ్ను రావణాసురుడి రూపంలో, త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించడం వివాదానికి దారితీసింది.
బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాలను దేవతా రూపాలతో పోల్చడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే బ్యానర్ను తొలగించారు. అలాగే దాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై విజయ్, త్రిష ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

