రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్పై జరిగిన పాశవిక హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ ఘటన ఆధారంగా దర్శకుడు భరత్ శ్రీనేట్ రూపొందించిన సినిమా ‘ఉదయ్పూర్ ఫైల్స్’. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాలో హింసను, ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని జమీయతే ఉల్మా- ఇ- హింద్ వంటి ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా విడుదలయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటూ అధికారులను అలర్ట్ చేశాయి. సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ కూడా సినిమాపై విమర్శలు చేశారు. “ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి చేసే ప్రయత్నం” అంటూ అన్నారు. సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు, ఓటీటీలో కూడా విడుదల చేయవద్దన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు చిత్రంపై దాదాపు 150 కట్స్ సూచించినట్టు సమాచారం. వివాదాస్పద సన్నివేశాల తొలగింపు అనంతరం సినిమాను సరికొత్త వెర్షన్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు భరత్ శ్రీనేట్ స్పందిస్తూ.. “ఇది మతాన్ని లేదా వ్యక్తిగత విశ్వాసాన్ని ఉద్దేశించిన సినిమా కాదు. ఇది ఒక భావజాలం, ఒక సత్యం గురించి మాట్లాడే సినిమా. ఎటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ఇందులో లేదు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రమని భావిస్తున్నా” అని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల మద్దతు పొందుతుందా? లేదా వివాదాలతో ఆగిపోతుందా అనే దానికి సమాధానం కొద్ది గంటల్లోనే సగటు ప్రేక్షకులు తీర్పు ఇవ్వబోతున్నారు.
- July 11, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor

