తెలంగాణలో మల్టీప్లెక్స్ విస్తరణలో ఏషియన్ సినిమాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పీవీఆర్, ఐనాక్స్ వంటి జాతీయ స్థాయి బ్రాండ్స్కు పోటీగా ఏషియన్ సంస్థ వరుసగా భారీ మల్టీప్లెక్స్లను నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. మహేష్బాబుతో కలిసి నిర్మించిన ఎఎంబీ సినిమాస్, అల్లు అర్జున్తో ఎఎఎ మల్టీప్లెక్స్, విజయ్ దేవరకొండతో మహబూబ్నగర్లో ఎవిడి మల్టీప్లెక్స్లు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి రూపొందించిన ‘ఎఆర్టి సినిమాస్’ ఇటీవలే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ -విజయవాడ హైవే మార్గంలోని వనస్థలిపురంలో నిర్మించిన ఓ మాల్లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఈస్ట్ సైడ్లో ఇది తొలి మల్టీప్లెక్స్ కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇంతవరకూ పెద్ద స్క్రీన్ మల్టీప్లెక్స్లు నిర్మించలేదు. అయితే ఈ కొరతను ఏషియన్ & రవితేజ కాంబో తీర్చింది. ‘ఎఆర్టి సినిమాస్’లోని ప్రధాన ఆకర్షణ ‘ఎపిక్ స్క్రీన్’. క్యూబ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ, ఐమాక్స్ స్థాయి అనుభూతిని అందిస్తోందని సినీప్రేమికులు చెబుతున్నారు. ఇది తెలంగాణలో తొలి ఎపిక్ స్క్రీన్ కావడం విశేషం. భారీ విజువల్స్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, గ్రాండ్ థియేట్రికల్ అనుభూతి వంటివి ఈ థియేటర్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కలుగుతుందట. కొందరు నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో తమ ఎక్సైట్మెంట్ను షేర్ చేసుకుంటున్నారు. ‘ఇది కొత్త స్థాయి సినిమా అనుభవం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జులై 31న విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో ‘ఎఆర్టి సినిమాస్’ రన్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఎపిక్ స్క్రీన్లో ప్రతి షోకు భారీ డిమాండ్ నెలకొంది. సిటీకి ఇతర ప్రాంతాల నుండి కూడా సినీప్రేమికులు ప్రత్యేకంగా వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్లో రవితేజ టచ్ ప్రతీ మూలన కనిపిస్తోంది. థియేటర్ ప్రవేశద్వారంలో “కిక్కు ప్రాప్తిరస్తు” అంటూ వెల్కమ్ చెబుతుండగా, వాష్రూమ్లో “అయ్య బాబోయ్.. ఇంత అందంగా ఉన్నానేంటి” అనే క్యాప్షన్, టికెట్ కౌంటర్ దగ్గర “లచ్చిందేవి” అంటూ ఫన్ కోట్ కనిపిస్తాయి. ఇవి చూసి రవితేజ ఫ్యాన్స్ ఫుల్గా ఖుషీ అవుతున్నారు.

- August 5, 2025
0
37
Less than a minute
Tags:
You can share this post!
editor