నాకు విషమిచ్చి చంపమని ఆర్డర్ వేయండి జడ్జి గారు

నాకు విషమిచ్చి చంపమని ఆర్డర్ వేయండి జడ్జి గారు

కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నాడు. జైలులో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట దర్శన్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన శారీరక, మానసిక స్థితి చాలా దిగజారిపోయిందని వాపోయాడు. చాలా రోజులైంది సూర్యభగవానుణ్ణి చూసి. జైలులో ఫంగస్, ఇన్ ఫెక్షన్ల భయాన్ని కలిగిస్తోంది. వేసుకునే బట్టల నుండి దుర్వాసన వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం దుర్భరంగా మారింది. దయచేసి నాకు విషం ఇచ్చి చంపండి అంటూ న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఇలాంటి పనులు చేయడం అసాధ్యం’ అని స్పష్టం చేశారు. దర్శన్ ను పోలీసులు 2024 జూన్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతని సన్నిహితురాలైన పవిత్రా గౌడకు అభిమాని రేణుకాస్వామికి అసభ్య మెసేజ్ లు పంపాడనే కారణంతో అతనిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో సుప్రీం కోర్టు ఈ ఏడాది ఆగస్ట్ 14న ఆ బెయిల్ ను రద్దు చేసింది. పైగా జైలులో ఆయనకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వకూడదని కూడా ఆదేశించింది. దీంతో ఆయనను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. తాజాగా విచారణలో భాగంగా 13, 14 నెంబర్ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను కోర్టు పరిశీలించింది. తదుపరి అభియోగాల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. దర్శన్ తనను బళ్లారి జైలుకు తరలించవద్దని, తాను ఉన్న జైలులో కనీసం మంచం, పరుపు వంటి సౌకర్యాలు కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. తన ఆరోగ్య పరిస్థితుల్లో కొంత గందరగోళం ఏర్పడినందున వాటిని తొలగించాలనే ఉద్దేశ్యంతో తన మనోవేదనను జడ్జి గారికి వెల్లడించారు.

editor

Related Articles