భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఆయన నిర్ణయాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ‘మేరా దేశ్ పహ్లే: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్రమోదీ’ ప్రీమియర్లో పాల్గొన్న జాన్వీకపూర్.. మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ కాన్సర్ట్ను నిర్వహించారు.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘ఈ వేదికపై నేనూ ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తోంది. మన దేశంలో ఉన్న అందరికీ మోదీ కథ గురించి తెలుసు. కానీ, ఒక నటిగా ఈ ఈవెంట్కు రావడం, ఆయన కథ వినడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మోదీ జీవితం, ఆయన దేశం కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చేసే ప్రతిపని అందరికీ స్ఫూర్తినిస్తుంది’ అని జాన్వీకపూర్ అన్నారు.
‘మేరా దేశ్ పహ్లే: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్రమోదీ’ విషయానికొస్తే.. ప్రముఖ రచయిత మనోజ్ ముంతాషిర్ ఈ కాన్సర్ట్ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బాల్యం నుండి జాతీయ నాయకుడిగా ఎదిగిన తీరును పాట రూపంలో రూపొందించారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.