హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరి దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో బుధవారం విచారణ చేపట్టారు. విచారణకు వీరిద్దరూ తొలిసారి కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ రోజున తీర్పు వెలువరించనుంది. కాగా, ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరు వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత రెండేళ్లుగా తల్లిదండ్రులు విడివిడిగా జీవిస్తున్నారు. డైవర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల స్కూల్ కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి.

- November 21, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
editor