నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువు మంట గలిసింది, దానికి గాను.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె చేసిన వ్యాఖ్యలు దాఖలు పరుస్తూ కోర్టులో పిటిషన్ వేశారు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నాగార్జున. అయితే ఈ పిటిషన్ గత శుక్రవారం విచారణకు రాగా.. నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా కేసును వాయిదా వేస్తూ.. సోమవారం విచారణ చేపట్టనున్నట్లు మనోరంజన్ కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక సోమవారం ఈ పిటిషన్ మనోరంజన్ కోర్టులో విచారణకు రాగా.. నాగార్జున ఆ రోజున సిటీలో లేనందున పిటిషన్ను మంగళవారంకు వాయిదా వేసింది. అలాగే రేపు కోర్టుకు హీరో నాగార్జున హాజరు కానుండగా.. అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు కోర్టు తెలియజేసింది. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా రేపే రికార్డు చేయాలని నాగార్జున తరపున అడ్వకేట్ కోర్టును కోరారు. దీనిపై సముఖత వ్యక్తం చేసిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరౌతున్నట్లు తెలిసింది.