అణుబాంబు దాడిపై సినిమా తీయబోతున్న కామెరూన్..

అణుబాంబు దాడిపై సినిమా తీయబోతున్న కామెరూన్..

టైటానిక్‌తో భావోద్వేగాలను, ‘అవతార్’ ఫ్రాంఛైజీతో విజ్ఞాన ఫిక్షన్‌ను మిళితం చేస్తూ ప్రపంచ సినిమాని షేక్ చేసిన దర్శక దిగ్గజం జేమ్స్  కామెరూన్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ (2025) వంటి భారీ ప్రాజెక్టుపై ప్ర‌త్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్న కామెరూన్, ఇప్పుడు ‘అవతార్’కి సంబంధం లేని మరో ప్రత్యేకమైన సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా కథా నేపథ్యం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా అణుబాంబు దాడి ఆధారంగా ఉండనుంది. ఇది కామెరూన్‌కి ‘టైటానిక్’ తర్వాత అత్యంత ఇష్టమైన, శక్తివంతమైన కథ ఇదే అని ఆయన స్వయంగా తెలిపారు. ఈ సినిమా కోసం కామెరూన్ తన దీర్ఘకాల స్నేహితుడు, రచయిత చార్లెస్ పెల్లెగ్రినో రాసిన ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా  అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు. 1945లో అమెరికా జపాన్‌పై అణుబాంబును వేసింది. అణుబాంబు దాడి 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాను ప్రకటించటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. “ఈ కథను తెరపై చూపించాలన్న ఆలోచన ఒక సాహసమే,” అంటూ కామెరూన్ వ్యాఖ్యానించాడు. ఇది ఎమోషన్, రియాలిటీ,  శాస్త్రాన్ని కలిపిన కథ. పుస్త‌కంలోని క‌థ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే మొద‌టి 20 నిమిషాల్లోనే జ‌నం థియేట‌ర్ల నుండి పారిపోతారు. అందుకే ప్రేక్ష‌కుడికి అనుభూతిని పంచేలా, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా ఈ సినిమాని తెర‌కెక్కిస్తాన‌ని కామెరూన్ స్ప‌ష్టం చేశారు. టైటానిక్ సినిమా కోసం నేను సముద్ర గర్భంలోని శిథిలాలను 33 సార్లు పరిశీలించాను. హిరోషిమా దాడి నేపథ్యంలో తీసే ఈ సినిమాకి కూడా అదేస్థాయిలో పరిశోధన చేస్తాను. సినిమాలే మనల్ని నిజంగా రక్షించగలవు అని సినిమా శక్తిని మరోసారి గుర్తు చేసుకున్నాడు కామెరూన్. కాగా, అణుబాంబు దాడి… చరిత్రలో ఓ విషాద అధ్యాయం. 1945లో అమెరికా, జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేయడం ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనగా చెప్పుకోవాలి. వేలాదిమంది మృతిచెందగా, లక్షల మందికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అణుబాంబు యుద్ధం తీవ్రతను చూపించాలనే ప్రయత్నమే కామెరూన్ తీసుకుంటున్న ఈ కొత్త సినిమా ఉద్దేశం.

editor

Related Articles