ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ కన్నడ’ కు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బిగ్ బాస్ స్టూడియోను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బెంగళూరు సౌత్ రామనగర జిల్లా బిడాదిలోని ‘జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్’ ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ సీజన్ షూటింగ్ జరుగుతోంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ ప్రోగ్రామ్లలో ఒకటి. అయితే ఇప్పుడు పర్యావరణ ఉల్లంఘనలతో ఈ షో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
KSPCB అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బిగ్ బాస్ నిర్వాహకులు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందకుండానే చిత్రీకరణ జరిపారు. అంతేకాకుండా స్టూడియో ప్రాంగణం నుండి కలుషిత నీటిని నేరుగా పర్యావరణంలోకి విడుదల చేశారు. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం, 1981 కాలుష్య నియంత్రణ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రామనగర జిల్లా డిప్యూటీ కమిషనర్కు స్టూడియోను సీజ్ చేయాలని KSPCB ఆదేశాలు జారీ చేసింది. అలాగే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని బెస్కామ్ (BESCOM) కు సూచనలు పంపింది. అధికారులు ఇప్పటికే స్టూడియో గేట్లు మూసివేసి, కంటెస్టెంట్లను వేరే ప్రదేశానికి తరలించారు.
