ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్పై ఖలిస్థానీ ఉగ్రవాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ తీవ్ర విమర్శలు, బెదిరింపులకి దిగిన విషయం తెలిసిందే.
ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్పతి 17’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దిల్జిత్, వేదికపై బిగ్ బీకి పాదాభివందనం చేశారు. ఈ క్షణం సోషల్ మీడియాలో వైరల్ కాగా, దిల్జిత్ వినయానికి అభిమానులు ప్రశంసలు కురిపించినా, పన్నూన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. “1984లో సిక్కుల మారణహోమానికి బాధ్యత వహించిన వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఆయన కాళ్లు మొక్కడం అనేది చరిత్రను అవమానించడం, బాధితులకు ద్రోహం చేయడం. నవంబర్ 1న సిక్కుల స్మారక దినోత్సవం రోజున మనస్సాక్షి ఉన్న ఎవరైనా సిక్కు వేదికపై ప్రదర్శన ఇవ్వరు అని పన్నూన్ హెచ్చరించాడు. అంతేకాక, ఎస్ఎఫ్జే సంస్థ ఆస్ట్రేలియాలో నవంబర్ 1న జరగనున్న దిల్జిత్ సంగీత కచేరీని అడ్డుకుంటామని ప్రకటించింది. దిల్జిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన ‘ఆరా టూర్’ లో బిజీగా ఉన్నారు.
 
											

 
											 
											