టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ తన సినీ కెరీర్ లో మరో కీలక అడుగు వేశారు. తాజాగా ఆయన OMI పేరుతో ఓ మల్టీ డైమెన్షనల్ సంస్థను స్థాపించారు. ఇది కేవలం సినిమా నిర్మాణ సంస్థ మాత్రమే కాకుండా, వెల్నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాల్లో సేవలందించబోయే వినూత్న వేదికగా రూపుదిద్దుకుంటోంది. ఈ సంస్థ అధికారిక లోగోను మంగళవారం భారత మాజీ ఉప-రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ఓమ్ (ఓంకారం), ఐ (నేను) కలయికగా రూపొందిన OMI పేరు ఎంతో ఆసక్తికరం. ఇది భవిష్యత్తులో ఎంతోమంది టాలెంట్ కి వేదిక అవుతుంది” అని ప్రశంసించారు.
“OMI… నా విజన్, నా బాధ్యత. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఒక కల. ఇది క్రియేటివిటీకి పునాదిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులకు, క్రియేటర్లకు ఇది ఓ వేదిక అవుతుంది. కొత్త కథలు చెప్పేందుకు, వినూత్న ఆలోచనలను పరిచయం చేయడానికే ఈ ప్రయాణం,” అని శర్వా వివరించారు. అలాగే, “ఈ ప్రయాణాన్ని ఒంటరిగా ప్రారంభిస్తున్నా కానీ నిజాయితీ, స్పష్టత, సంకల్పంతో ముందుకు సాగుతున్నాను. ప్రతి అడుగు బాధ్యతతో వేస్తున్నాను,” అని చెప్పారు.
